మహబూబ్నగర్ : అన్ని హంగులతో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవనాన్ని తీర్చిదిద్దాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన నూతన సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన నిర్మాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఐడీఓసీ భవన నిర్మాణంలో భాగంగా ఉద్యాన పనులను, మొక్కలు నాటే కార్యక్రమాన్ని, లాన్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, ఆర్చి పనులు వేగవంతం చేయాలని, నూతన కలెక్టర్ కార్యాలయం పక్కనే బస్ బే నిర్మించాలన్నారు. ఇటు మహబూబ్నగర్ నుండి వచ్చే వారికి అటు భూత్పూర్ నుండి వచ్చే వారికి సౌకర్యంగా ఉండేలా, అదేవిధంగా ఆటోలు కూడా నిలిపేందుకు ఏర్పాటు చేయాలని చెప్పారు.
నూతన కలెక్టర్ కార్యాలయనికి ప్రహరీ నిర్మించాలని, బస్ షెల్టర్, పోలీస్ ఔట్ పోస్ట్, బ్యాంకు, ఏటీఎం తదితర వాటన్నింటిని ముందస్తు ప్రణాళికతో చేపట్టాలని ఆదేశించారు. అదేవిధంగా బస్టాప్ వద్ద ఆటోలు నిలుపుకునేందుకు అవకాశం ఉండాలన్నారు. నూతన కలెక్టర్ కార్యాలయ భవనానికి మిషన్ భగీరథ కనెక్షన్, హెలిప్యాడ్ నిర్మాణం పనులను తనిఖీ చేశారు. వీటితో పాటు కార్యాలయం లోపల సమావేశ మందిరంలో ఫాల్ సీలింగ్ పనులను మంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు, ఈఈ స్వామి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.