Minister Srinivas Goud | ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చి పోవుడే తప్పాడే.. ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్నగర్లోని క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రజలు హుషారయ్యారని.. మాయమాటలకు మోసపోయే స్థితిలో లేరన్నారు. ప్రధాని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే మహబూబ్నగర్కు మూడు సార్లు వచ్చి.. పెట్టిన చోటే సభలు పెడుతూ మాయమాటలతో ప్రచారం చేయడమే తప్పా మోదీతో ఎలాంటి ఉపయోగం లేదన్నారు.
సభావేదిక నుంచి ఒకవైపు కరివెన, మరో వైపు ఉదండాపూర్, ఇంకోవైపు ఐటీ టవర్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్క్ కనబడుతాయన్నారు. వాటిని ఒకమారు చూడాలన్నారు. ఈ నెల 2న 26 వేల ఎకరాల్లో జంగల్ సఫారీని ప్రారంభిస్తామన్నారు. మన్యంకొండ ఆలయ అభివృద్ధి నిమిత్తం నివేదికలను పంపిస్తే ఒక్క రూపాయి ఇవ్వకుండా తిప్పి పంపిన విషయాలను జిల్లావాసులు మర్చిపోరన్నారు. ప్రతి మారుమూలకు తాగునీరు ఇస్తున్నామని, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇలాంటి ఒక్క పథకమైనా అమలవుతుందా? ప్రజలకు చెప్పాలన్నారు.
స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత అనతి కాలంలోనే ఎంతో ప్రగతి సాధించామన్నారు. అత్యధికంగా ట్యాక్స్లు చెల్లిస్తూ కేంద్రానికి అండగా నిలబడితే.. వారు మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్కు రావడం కాదు రూ.లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను వెంటనే ఆమోదించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయాల సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్ పాల్గొన్నారు.