మహబూబ్నగర్: తమ రాజకీయ అవసరాల కోసం బీజేపీ (BJP) నాయకులు పేపర్ లీక్ (Paper Leak) చేసి విద్యార్థులు, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Minister Srinivas goud) ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందీ పేపర్ను (Hindi Paper) లీక్ చేసిన బీజేపీ నాయకుడు వెంటనే దానిని ఆ పార్టీ అధ్యక్షుడైన బండి సంజయ్కి (Bandi Sanjay) పంపించడం, ఆయన మీడియాకు సమాచారం అందించడం కుట్రలో భాగమేనని చెప్పారు. టెన్త్ హిందీ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మహబూబ్నగర్లో (Mahabubnagar) స్పందించారు. పేపర్ బయటికి వచ్చిందని తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునికి సమాచారం ఎందుకు వెళ్లిందని ప్రశ్నించారు. మీడియావాళ్లకు సమాచారం అందించి రాద్ధాంతం చేశారంటే దాని వెనుకున్న కుట్రను అర్థం చేసుకోవాలన్నారు.
పేపర్ను వందల వాట్సప్ గ్రూపులకు షేర్చేసి విద్యార్థులను భయాందోళనలకు ఎందుకు గురిచేశారని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ (TSPSC) పేపర్లను లీక్ చేసిన నిందితుడు కూడా బీజేపీ కార్యకర్తేనని విమర్శించారు. ఇప్పుడు పదో తరగతి పేపర్ లీక్ పేరుతో ఆ పార్టీ నాయకులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ చేయడం సర్వసాధారణం కాబట్టి ఆ కుట్రలను తెలంగాణలో (Telangana) అమలు చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు ఆరోపించారు. పదో తరగతి పేపర్ లీకేజీ కుట్రలో ఉన్నది ఎవరైనా, వారెంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ పోలీసు (Telangana Police) వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత బలమైనదని, ఇలాంటి కుట్రదారులను వెంటనే అరెస్టు చేసి, మరోసారి ఇలాంటి ఆలోచన చేయాలంటేనే భయపడేలా చేస్తామన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న కేంద్రం ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రైవేటీకరణ పేరుతో ఉన్న ఉద్యోగాలను కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ లేకుండా బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. పేపర్ లీకేజ్ ద్వారా తెలంగాణకు అప్రతిష్ఠ తెచ్చేందుకు చేస్తున్న కుట్రలను ఆపి.. రాష్ట్రాభివృద్ధికి అవసరమైతే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని హితువు పలికారు.