హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ మతచిచ్చు పెట్టేందుకు కుట్ర చేస్తున్నదని, ఆ కుట్రలు ఇక్కడ సాగే అవకాశంలేదని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి సోమవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మహబూబ్నగర్లో రెండు రోజులు కేంద్రమంత్రి మహేంద్రనాథ్ పాండే పర్యటించారని, ఆయనకు కనీసం తెలంగాణ, పాలమూరు చరిత్ర, సంస్కృతి గురించి అవగాహన లేదని విమర్శించారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రధాని మోదీ మొదటగా అనుమతినిచ్చిన విషయం పాండేకు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ, బీజేపీ నాయకులు ఎన్నికలప్పుడు వచ్చి పాలమూరు- రంగారెడ్డి పథకంపై ఏ హామీ ఇచ్చారో కేంద్రమంత్రికి తెలుసా? అని నిలదీశారు. కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరు జిల్లా దశ మారిందన్నారు.
మహబూబ్నగర్ నుంచి వలసలను కేసీఆర్ ఆపారా లేక మోదీ ఆపారా చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణపేటకు సైనిక సూల్ ఇస్తామన్న బీజేపీ నేతల హామీ ఏమైందని ప్రశ్నించారు. బీజేపీ నేతల పిచ్చి మాటలు నమ్మేందుకు ప్రజలు పిచ్చోళ్లు కాదన్నారు. తెలంగాణలో ఏ పథకం చూసినా ఓ రికార్డ్ అని, కేంద్రంలో ఏ పథకమైనా ప్రజలకు ఉపయోగపడేది ఉందా అని ప్రశ్నించారు.డబుల్ ఇంజిన్ సరార్ అంటే ప్రజల గొంతు నొకడమా? అని శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. బీజేపీ నేతలు ప్రశ్నించే గొంతులను నొక్కి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకన్నా అద్భుతమైన పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్నాయా? అని ప్రశ్నించారు. అభివృద్ధిపై ఢిల్లీ వేదికగా చర్చకు సిద్ధమా? అని సవాల్ చేశారు. బీజేపీకి దమ్ముంటే పెట్రో ఉత్పత్తుల ధరల పెంపును ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తూ రిజర్వేషన్లను ఎత్తి వేసే కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. రాష్ర్టాల్లో ఎమ్మెల్యేలను ఎలా కొనాలి, అక్కడి ప్రభుత్వాలను ఎలా కూల్చాలన్నదే బీజేపీ తపన అని ఆరోపించారు. ప్రజలు ఈ కుట్రలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు.
సిలిండర్పై మోదీ బొమ్మ పెట్టాలి
బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు తెలంగాణపై తోడేళ్ల గుంపులా దాడి చేస్తున్నారని శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. పచ్చ బడ్డ తెలంగాణలో రక్తం పారించాలన్నదే బీజేపీ ఆలోచన అని విమర్శించారు. రేషన్ షాపుల దగ్గర మోదీ ఫొటో పెట్టాలని డిమాండ్ చేస్తున్న కేంద్రమంత్రులు.. దమ్ముంటే గ్యాస్ సిలిండర్లపై మోదీ బొమ్మ వేయాలని డిమాండ్ చేశారు. దేశానికి బీసీ ప్రధానిగా ఉన్నా బీసీలకు చేసిందేమీ లేదని, కనీసం ఓబీసీ మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. పాలమూరు- రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వరు కానీ.. కర్ణాటకలో అప్పర్ భద్రకు ఇవ్వడం తెలంగాణ పై వివక్ష కాదా? అని నిలదీశారు. పాలమూరు- రంగారెడ్డి పథకాన్ని పూర్తి చేస్తామని ప్రధాని మోదీ స్వయంగా చెప్పారని మంత్రి గుర్తుచేశారు.
కేంద్రమంత్రులు నిజాలు మాట్లాడాలి:ఎమ్మెల్యే అంజయ్య, ఎమ్మెల్సీ కసిరెడ్డి
తెలంగాణకు వస్తున్న కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు వాస్తవాలు మాట్లాడాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హితవు పలికారు. అబద్ధాలు మాట్లాడటం తప్ప బీజేపీ నేతలు కేంద్రం నుంచి తెలంగాణకు ఏమి తెస్తారో చెప్పడం లేదని విమర్శించారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి బీజేపీ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ కుట్ర రాజకీయాలు, ఈడీ, సీబీఐ బెదిరింపులు తెలంగాణలో కుదరవని తేల్చిచెప్పారు.