హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మరోసారి అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని, వారి కుట్రలను ఛేదిస్తామని రాష్ట్ర ఎక్సైజ్, సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్కు ఉన్న ప్ర జాబలాన్ని, టీఆర్ఎస్ బలగాన్ని ఎదుర్కోలేక బీజేపీ రైతులను అడ్డం పెట్టుకొని కుట్రలు చేస్తున్నదని విమర్శించారు. ఈ కుట్రలను ఎలా ఛేదించాలో తమకు బాగా తెలుసని చెప్పారు. శుక్రవారం టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణరెడ్డి, పాడి కౌశిక్రెడ్డి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తమ నాయకుడు ఓపిక పడుతున్నారని, ఆయన ఒక్క పిలుపునిస్తే రైతులు లక్షలాదిగా ఉద్యమిస్తారని, దాన్ని కేంద్రం తట్టుకోలేదని అన్నారు. దేశవ్యాప్తంగా రైతులు కేసీఆర్ పిలుపు కోసం ఎదురుచూస్తున్నారని, ఇప్పటికైనా తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పి కేంద్రం తప్పులను సరిదిద్దుకోవాలని సూచించారు.
రాష్ట్ర మంత్రుల, ఎంపీలు ఢిల్లీకి వెళ్లింది రైతుల కోసమేనని, పదవుల కోసమో, పైరవీల కోసమో కాదని శ్రీనివాస్గౌడ్ స్పష్టంచేశారు. వడ్లు కొనాలని అడిగేందుకు వెళ్లిన రాష్ట్ర ప్రతినిధి బృందాన్ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అత్యంత దారుణంగా అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ అవమానం మంత్రుల బృందానికి మాత్రమేకాదని, తెలంగాణ రైతాంగం మొత్తాన్ని అవమానించారని మండిపడ్డారు. బీజేపీ ఇందుకు తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. నాలుగైదు రోజులుగా రాష్ట్ర మంత్రులు, నెల రోజులుగా టీఆర్ఎస్ ఎంపీలు ఢిల్లీలో పోరాటం చేస్తుంటే, ఢిల్లీకి ఎవరు రమ్మన్నారని పీయూష్గోయల్ అవమానించారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం రైతుల విషయంలో రాజకీయాలు చేయటం సరికాదని హితవు పలికారు. రాష్ట్ర బీజేపీ నేతలు ఢిల్లీలో రైతుల కోసం కాకుండా తమ వ్యక్తిగత రాజకీయాల కోసం పాకులాడుతున్నారని విమర్శించారు. ధాన్యం సేకరించాల్సిన బాధ్యతను విస్మరించి కేంద్రప్రభుత్వం రాష్ట్ర సర్కారుపై విషం చిమ్ముతున్నదని ఆగ్రహించారు.
బీజేపీ నేతలకు దమ్ముంటే తెలంగాణకన్నా మిన్నగా అద్భుత ఫలితాలు సాధించిన ఒక్క బీజేపీ పాలిత రాష్ర్టాన్ని అయినా చూపాలని శ్రీనివాస్గౌడ్ డిమాండ్చేశారు. బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రగతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా కేంద్రం స్పందించాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును తామే పూర్తి చేస్తామని ప్రధాని మోదీ మాట ఇచ్చి తప్పారని విమర్శించారు. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ, మహిళా రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేం ద్రానికి పంపినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ రైతుల కష్టాలను మరిచి రాజకీయ లబ్ధికోసం టీఆర్ఎస్పై బురద జల్లుతున్నదని విమర్శించారు.
గీత కార్మికుల సంక్షేమానికి తెలంగాణలో అమలుచేస్తున్న పథకాలు ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్నాయని అఖిల భారత ఆర్య ఈడిగ రాష్ట్రీయ మహామండలి పీఠాధిపతి ప్రణవానందస్వామి ప్రశంసించారు. గౌడ కులస్తుల సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందున్నదని కొనియాడారు. శుక్రవారం ఆయన ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ను రవీంద్రభారతిలోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కర్ణాటకలోని యాదగిరిలో జనవరి 18న నిర్వహించనున్న ఆధ్యాత్మిక సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని శ్రీనివాస్గౌడ్ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గౌడ కులస్తుల సంక్షేమం, అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన పథకాలను మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆయనకు వివరించారు.