న్యూఢిల్లీ : కృష్ణా నదిపై అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. రాయలసీమ ఎత్తిపోతల, ఆర్డీఎస్ కుడి కాల్వ నిర్మాణాల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పోతిరెడ్డిపాడుకు డబుల్ దోపిడీ చేసేలా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ అడ్డగోలుగా జల దోపిడీ చేస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు అన్యాయం చేసినా వైఎస్సార్ను దొంగ అనకపోతే దొర అనాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్సార్ నరరూప రాక్షసుడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఏపీతో మంచిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నా.. జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఢిల్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు
తెలంగాణ వెనుకబాటు తనానికి కూడా వైఎస్సారే కారణమని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైఎస్సారే కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు. ఎంతో మంది చావులకు ఆయన కారకుడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ అన్నోళ్లందరినీ నక్సలైట్ల పేరు మీద చంపించిన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ నినాదం ఎత్తుకున్న గద్దరన్నపై కూడా నాటి ఆంధ్రా పాలకులు కాల్పులు జరిపారు. మావోయిస్టుల పేరుతో ఎంతో మందిని బలితీసుకున్నారు. తెలంగాణ పదం ఉచ్ఛరించిన కాంగ్రెస్ నాయకులను కూడా వైఎస్సార్ ఇబ్బంది పెట్టి.. మానసిక క్షోభకు గురి చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి తీయకుండా, మొబిలైజేషన్ అడ్వాన్స్ల కింద వేల కోట్ల రూపాయాలు ఆంధ్రా పాలకులు ఎత్తుకుపోయారు అని ధ్వజమెత్తారు. తెలంగాణకు వైఎస్సార్ చేసిందేమీ లేదు. తెలంగాణలో ఏ కులవృత్తిని కూడా ఎదగనీయలేదు. వైఎస్సార్ కల్లుపై కూడా నిషేధం విధించారు.
తెలంగాణ ఉద్యమంలో ముందున్న ఉద్యోగులపై ఏసీబీ కేసులు పెట్టించి ఇబ్బంది పెట్టించింది వైఎస్సార్ కాదా? అని అడిగారు. ఏపీపీఎస్సీలో మెంబర్లను ఆంధ్రా వారిని పెట్టి అక్రమంగా ఏపీ అభ్యర్థులకు పోస్టులను కేటాయించిన విషయాన్ని తాము మరిచిపోలేదన్నారు. తెలంగాణ అభ్యర్థులు రాత పరీక్షలో మెరుగైన మార్కులు సాధించినప్పటికీ.. ఇంటర్వ్యూలో మాత్రం ఏపీ అభ్యర్థులకు పోస్టులు ఇచ్చేవారు. ఉమ్మడి ఏపీలో గ్రూప్-1 పోస్టుల్లో అన్యాయం చేశారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.