హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): కల్లు, గీత వృత్తిపై విధించిన నిషేధాన్ని కర్ణాటక ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. మంగళూరు నుంచి బెంగళూరు వరకు కర్ణాటక శ్రీనారాయణ గురు పీఠాధిపతి స్వామి ప్రణవానంద నిర్వహించతలపెట్టిన పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. గుల్బర్గాలోని హెరిటేజ్ ఇన్ హోటల్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. పాదయాత్ర వాల్పోస్టర్, ఆడియో సీడీలను ఆవిషరించారు. అనంతరం శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. ఓవైపు స్వదేశీ వస్తువులను ప్రోత్సహించాలని చెప్తూ, మరోవైపు కల్లును నిషేధించడం కేంద్రం, కర్ణాటక ప్రభుత్వాల ద్వంద్వ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
కల్లుపై నిషేధం వల్ల కర్ణాటకలో 70 లక్షల మంది గౌడ, ఈడిగ కులాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కల్లు విదేశీ డ్రింకా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ కుల వృత్తులకు పూర్వ వైభవాన్ని తెస్తున్నారని కొనియాడారు. కల్లుపై నిషేధం ఎత్తివేసేందుకు జేడీఎస్ చేపట్టిన ఉద్యమానికి బీఆర్ఎస్ తరపున మద్దతు తెలుపుతామని చెప్పారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ గీత వృత్తిని ప్రోత్సహిస్తున్నారని, ప్రత్యేక నీరా పాలసీ తెచ్చారని, తాటి , ఈత చెట్లపై పన్నులను రద్దు చేశారని గుర్తుచేశారు. స్వామి ప్రణవానంద పాదయాత్ర విజయవంతం కావాలని శ్రీనివాస్గౌడ్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జేడీఎస్ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజు గుత్తేదార్, తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బాలగొని బాలరాజుగౌడ్, తెలంగాణ ఫిల్మ్ చాంబర్ చైర్మన్ ప్రతాని రామకృష్ణగౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, మాజీ చైర్మన్ నాగేందర్గౌడ్, కూరేళ్ల వేములయ్యగౌడ్, కీర్తీలత గౌడ్, రాజయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.