మహబూబ్నగర్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ఈడీ, సీబీఐకి బెదరం. తెలంగాణ సీఎం కేసీఆర్ జోలికొస్తే ఊరుకోం’ అని ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. గురువారం హైదరాబాద్లో మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు సుమారు 300 మంది టీఆర్ఎస్లో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లే యత్నం చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కేసీఆర్ అండగా నిలిచారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై కేసులు పెడ్తామనే బెదిరింపులకు భయపడేది లేదన్నారు. టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజావ్యతిరేక విధానాలు, మతకల్లోలాలు సృష్టిస్తున్న బీజేపీలో ఉండలేక టీఆర్ఎస్లోకి వలస వచ్చినట్టు పేర్కొన్నారు.