మహబూబ్నగర్, సెప్టెంబర్ 30: మహబూబ్నగర్ జిల్లాకు ప్రధాని నరేంద్రమోదీతో ఎలాంటి ప్రయోజనం లేదని మంత్రి శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. వచ్చుడు, పోవుడు కాదని.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం ఆయన మహబూబ్నగర్లోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే మహబూబ్నగర్కు మూడుసార్లు వచ్చి.. పెట్టిన చోటే సభలు పెడుతూ మాయమాటలు చెప్పడం మినహా మోదీతో ఎలాంటి ఉపయోగం లేదని మండిపడ్డారు. సభావేదిక నుంచి ఒకవైపు కరివెన, మరో వైపు ఉదండాపూర్, ఇంకోవైపు ఐటీ టవర్, కేసీఆర్ ఎకో అర్బన్ పార్కు వంటివి కన్పిస్తాయని, వాటిని ఒకసారి చూడాలని అన్నారు.
సోమవారం 26 వేల ఎకరాల్లో జంగల్ సఫారీని ప్రారంభిస్తామని చెప్పారు. మన్యంకొండ ఆలయ అభివృద్ధి నిమిత్తం నివేదికలను పంపిస్తే రూపాయి కూడా ఇవ్వకుండా తిప్పి పంపిన విషయాన్ని జిల్లావాసులు మర్చిపోరని తెలిపారు. ప్రతి మారుమూల గ్రామానికి తాగునీరు ఇస్తున్నామని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఇలాంటి ఒక్క పథకమైనా అమలవుతున్నదా? అని ఆయన ప్రశ్నించారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత అనతి కాలంలోనే ఎంతో ప్రగతి సాధించినట్టు చెప్పారు. అత్యధికంగా పన్నులు చెల్లిస్తూ కేంద్రానికి అండగా నిలబడితే.. వారు మాత్రం తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. మహబూబ్నగర్కు రావడం కాదు.. లక్ష కోట్ల ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను వెంటనే ఆమోదించాలని అన్నారు.