మహబూబ్నగర్ టౌన్, ఫిబ్రవరి 19 : నాడు సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రాం తాలు నేడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ నుంచి వార్డు పర్యటనకు మంత్రి శ్రీకారం చుట్టారు. ముందుగా ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు చేసి పాలకొండ, ప్రేమ్నగర్లో పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ.. హైదరాబాద్లోని మణికొండ తరహాలో పాలకొండ అభివృద్ధి చెందుతున్నదని తెలిపారు. గతంలో ఏ మా త్రం డిమాండ్ లేని భూములు నేడు ఎకరం రూ.కోట్లు పలుకుతున్నట్టు చెప్పారు. పాలమూరును రాష్ట్ర రాజధానికి దీటుగా తీర్చిదిద్దుతున్నామని, అందుకే ప్రజలు ఇక్కడ నివాసం ఉండేందుక ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.
మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, రోడ్లను, చౌరస్తాలను సుందరీకరించినట్టు చెప్పారు. కేవలం ఎన్నికల సమయంలో కులం, మతం పేరుతో రాజకీయం చేస్తూ ఓట్లు దండుకునేందుకు కొన్ని రాజకీయ పార్టీ ల నేతలు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. అలాంటి నాయకులకు ప్రజలే తగిన బుద్ధిచెప్తారని హెచ్చరించారు. నాడు ప్రజలకు ఆపద వస్తే పట్టించుకోని నేతలు నేడు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని మంత్రి వెల్లడించారు.
అధునాతన క్రికెట్ స్టేడియం నిర్మిస్తాం
మహబూబ్నగర్లో త్వరలోనే అధునాతన క్రికెట్ స్టేడియాన్ని నిర్మిస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతిని పురస్కరించుకొని గోర్ బంజారా ప్రీమియర్లీగ్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బోయపల్లి సమీపంలోని ఎండీసీఏ మైదానంలో జీబీపీఎల్-5 క్రికెట్ టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొత్త స్టేడియాన్ని అద్భుతంగా నిర్మిస్తామన్నారు.