మహబూబ్నగర్ : మనతోపాటు స్వాతంత్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి పరిశీలించుకోవాలని.. వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా ఓ లక్ష్యంతో ముందుకు సాగి పేదరికాన్ని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందని రాష్ట్ర ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా మహబూబ్ నగర్ రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం కళాకారుల నృత్య ప్రదర్శనలు తిలకించారు. ప్రముఖ నృత్యకారిణి మంజుల రామస్వామి బృందం ప్రదర్శించిన ‘కోటి రతనాల వీణ.. నా తెలంగాణ’ భరతనాట్యం చూపరులను కట్టిపడేసింది. 25 మంది వీణ కళాకారులు ‘సారే జహాసే అచ్చా’ గీతం.. మంత్రముగ్ధులను చేసింది. వెంకట్ బృందం పేరిణి శివతాండవం ఆకట్టుకున్నది. అనంతరం మంత్రి కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్వేషాలు, కుల మతాల పేరిట చిచ్చుపెట్టి రాజ్యం నడపాలంటే.. అది ఎన్నో రోజులు సాధ్యం కాదనే విషయాన్ని గమనించాలన్నారు.
అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరాలంటే ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత మన ప్రాంతం ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్లిందని పేర్కొన్నారు. అయినా, భవిష్యత్ తెలంగాణ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఉండబోతోందన్నారు. కుల మతాల విద్వేషాలను రూపుమాపి యువతకు గొప్ప భవిష్యత్ను అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్వాతంత్రం సాధించిన మహనీయుల త్యాగఫలం వృథా కారాదన్నారు.
కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, కలెక్టర్ వెంకట్రావ్, అడిషనల్ కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, ముడా చైర్మన్ గంజి వెంకన్న ముదిరాజ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు గోపాల్, అడిషనల్ ఎస్పీ రాములు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్, జిల్లా పర్యాటక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.