Srinivas Goud | మహబూబ్నగర్ : ఎగ్జిట్ పోల్స్ను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజలు నమ్మొద్దని మంత్రి శ్రీనివాస్గౌడ్ సూచించారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి చంద్రశేఖర్తో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పదిలంగా ఉందని ఎగ్జిట్ పోల్స్ బూటకమన్నారు. కాంగ్రెస్ కుల, బీజేపీ మత రాజకీయాలు చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేశారని ధ్వజమెత్తారు. కేవలం 30 రోజులు వారు నటించడానికే ఇక్కడికి వచ్చారని విమర్శించారు.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచే వారిని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముందు బెంగుళూర్లో ఉంచేందుకు ప్లాన్ చేయడం వెనుక ఆంతర్యం ఎటువైపు దారితీస్తుందన్నారు. సురభి నాటకాలు వేసే వారి కంటే కాంగ్రెసోళ్లు చేసిన నాటకాలు బాగున్నాయని ఎద్దేవా చేశారు. రైతులకు మంచి చేయాలనే తపనతో రైతుబంధు పెడితే ఆ డబ్బులను కూడా నిలిపిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. ఇప్పటికే ఉత్తమ్కుమార్రెడ్డి రైతుబంధు రైతులకు ఎందుకు..? ఎక్కువ భూములు ఉన్న వారికి ఎందుకు..? అని మాట్లాడుతున్నారన్నారు. పది మంది సీఎం అభ్యర్థులుగా చెప్పుకొనే కాంగ్రెస్ ఇష్టానుసారం మాట్లాడుతున్నదన్నారు. వందకు వందశాతం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆ పార్టీ నేతల వెంట ఉన్న వారే కారు గుర్తుకు ఓటేశామని చెప్పారన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, నాయకులు పాల్గొన్నారు.