హైదరాబాద్: గత ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పనులను కాంగ్రెస్ సర్కార్ నిలిపివేయదని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) అన్నారు. రాష్ట్ర ప్రగతే తమ విజన్ అని చెప్పారు. అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి రాష్ట్రం హైదరాబాద్ వైపు చూస్తున్నదని వెల్లడించారు. హైదరాబాద్లోని హోటల్ ఐటీసీ కాకతీయలో సీఐఐ తెలంగాణ ఇన్ఫ్రా రియల్ ఎస్టేట్ సదస్సును మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 3 దశాబ్దాలుగా స్థిరాస్తి రంగం ఎంతో పుంజుకుందన్నారు. సుస్థిరమైన విధానంలో స్థిరాస్తి రంగం అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. విధానపరమైన నిర్ణయాల్లో పారిశ్రామికవేత్తల సహకారం అవసరం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. దావోస్ పర్యటనలో మౌలిక వసతులపై కూడా చర్చించామని వెల్లడించారు.
చేసే పనిలో డిజైన్, నాణ్యత, స్థిరత్వం విషయంలో పారిశ్రామిక వేత్తలు సరైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇదే మన పారిశ్రామిక విధానంలో ప్రతిబింబిస్తుందని తెలిపారు. మీ వినూత్న ఆలోచనలే రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.