హైదరాబాద్ : ములుగు(Mulugu) అటవీ ప్రాంతంలో 500 ఎకరాల్లో చెట్లు నేలకూలడంపై మంత్రి సీతక్క (Minister Seethakka )విస్మయం వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే చెట్లు నెలకొరిగిన ప్రాంతాన్ని సందర్శించినప్పటికి ఈ స్థాయిలో లక్ష చెట్ల వరకు కూలిపోయాయని ఊహించలేదన్నారు. జరిగిన నష్టాన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో అంచనా వేసే క్రమంలో జరిగిన విధ్వంసం బయటపడిందన్నారు. ఘటనపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుంచి పీసీసీఎఫ్, డీఎఫ్ఓ, స్థానిక అధికారులతో మంత్రి టెలిఫోన్లో మాట్లాడారు. 500 ఎకరాల్లో అటవీ సంపద నేల కూలిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో భారీ వృక్షాలు( Huge trees) నేల కూలడంపై సమగ్ర విచారణకు ఆదేశించారు.
ఘటన ప్రాంతాన్ని సందర్శించి పీసీసీఎఫ్ నివేదిక సిద్ధం చేస్తున్నారని తెలిపారు. అడవిలో సుడిగాలి రావడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం అదృష్టమన్నారు. ఈ సుడిగాలి గ్రామాల్లో సంభవించి ఉంటే పెను విధ్వంసం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. సమక్క, సారలమ్మ తల్లుల దయ వల్లే సుడిగాలి ఊర్ల మీదకు మల్లలేదన్నారు. తల్లుల దీవేనతోనే ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని వెల్లడించారు.
చెట్లు నెలకూలడంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలను పంపి పరిశోధన జరిపించి కారణాలు గుర్తించేలా కేంద్ర మంత్రులు చొరవ చూపాలన్నారు. అటవీ ప్రాంతంలో చెట్లు కూలిన చోట తిరిగి చెట్లు పెంచేలా ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాకి విజ్ఞప్తి చేశారు.