ఉట్నూర్/ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 12 : ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని పంచాయతీరాజ్, మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరలో భాగంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అధ్యక్షతన ప్రజాదర్బార్ నిర్వహించారు.
ఈ దర్బార్లో మంత్రి మాట్లాడుతూ.. హైటెక్ యుగంలో కూడా సరైన రహదారులు లేవని, అందుకే సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నారని తెలిపారు. నాగోబా దేశంలోనే రెండో పెద్ద జాతర అని, అందుకే ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
పనిష్మెంట్లో భాగంగా అధికారులకు ఈ ప్రాంతానికి బదిలీ చేయొద్దని, అలాంటి వారు గిరిజనులకు ఏం చేయలేరని తెలిపారు. ఇష్టంతో పనిచేసే అధికారులను పంపాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎంపీ నగేశ్, కలెక్టర్ రాహుల్రాజ్, ఎస్పీ గౌష్ ఆలం, ఉట్నూర్ ఐటీడీఏ ఇన్చార్జి పీవో ఖుష్బూ గుప్తా, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి పాల్గొన్నారు.