హైదారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): బంజారా ప్రతినిధుల జాతీయ సదస్సు హైదరాబాద్లో ఈ నెల 28న నిర్వహించనున్నట్టు రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వెల్లడించారు. సదస్సు పోస్టర్ను మంత్రుల నివాస సముదాయంలో ఆవిష్కరించిన అనంతరం ఆమె మాట్లాడారు. బంజారాహిల్స్లోని బంజారా భవన్లో ఈ సదస్సును నిర్వహించనున్నట్టు చెప్పారు.
ఆదివాసీ, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపేలా తోడ్పాటును అందించే వేదికలుగా కుమ్రంభీం ఆదివాసీ భవన్, సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారా భవనాలు ఉపయోగపడాలన్నదే ప్రభుత్వ సంకల్పమని తెలిపారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ, గిరిజన మేధావులు ఎప్పటికప్పుడు మేధోమథనం చేయాలని కోరారు.
ఆదివాసీ, గిరిజన బిడ్డల మేలు కోసం నిత్యం కృషి చేసినప్పుడే ఆయా భవనాల నిర్మాణానికి సార్థకత అని సీఎం కేసీఆర్ పేర్కొన్న విషయాన్ని ఆమె గుర్తుచేశారు. కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ రమావత్ వాల్యానాయక్, ట్రైకార్ చైర్మన్ రామచంద్రనాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రూప్సింగ్నాయక్, ప్రొఫెసర్ రమణానాయక్, రాంబాల్నాయక్, రాంబాబునాయక్, సింపల్బాయి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.