హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన గిరిజనులకు స్వర్ణయుగంగా మారిందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. తెలంగాణలోని గిరిజనగూడేల్లో తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి జరిగిందని, రాష్ట్రంలో గిరివికాసం వెల్లివిరుస్తున్నదని తెలిపారు. పోడుభూముల పంపిణీ-గిరిజన సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై శనివారం అసెంబ్లీలో జరిగిన చర్చ అనంతరం ఆమె ప్రసంగించారు. దశాబ్దాలు అభివృద్ధికి ఆమడదూరంలో బతుకుతున్న గిరిజనుల బతుకుల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారని చెప్పారు. రాష్ట్రంలో 500 జనాభా దాటిన 2,471 తండాలను, ఆదివాసీగూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చారని గుర్తు చేశారు.
హైదరాబాద్ నడిబొడ్డున, రాష్ట్రవ్యాప్తంగా 32 ఆదివాసీ, బంజారా భవన్లు నిర్మించారన్నారు. రాష్ట్రం వచ్చేనాటికి 91 గిరిజన గురుకులాల్లో 40,990 మంది ఉంటే.. ప్రస్తుతం 188 గిరిజన గురుకులాల్లో 91,370 మంది విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. రోడ్డు కనెక్టివిటీ లేని 1,682 గిరిజన ఆవాసాలకు రూ.1276 కోట్లు వెచ్చించి 3173.63 కిలో మీటర్ల బీటీ రోడ్డు నిర్మించినట్టు తెలిపారు. 3,467 గిరిజన ఆవాసాలకు రూ.321 కోట్లతో త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించామని చెప్పారు. దీనివల్ల 2.4 లక్షల ఎకరాల గిరిజన రైతులకు లబ్ది చేకూరిందని చెప్పారు. సుమారు లక్ష గిరిజన కుటుంబాలకు 101 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్ అందించినట్టు పేర్కొన్నారు. గిరివికాసం పథకం ద్వారా 56,613 ఎకారాల భూమిని సాగులోకి తీసుకొచ్చామని, తద్వారా 19,698 మందికి లబ్ధి చేకూరిందని చెప్పారు. పోడు భూములకు పట్టాలతో గిరిజనుల దశాబ్దాల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,06,369 ఎకరాలకు పోడు పట్టాలివ్వాలని సర్కారు సంకల్పించిందని, 1,51,146 మంది గిరిజనులకు పోడు పట్టాలు అందించినట్టు వివరించారు.
సంతోషం గిరిజనులు: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
ఎంతోకాలంగా గిరిజనులు ఎదురుచూస్తున్న గిరిజనుల కలను ప్రభుత్వం సాకారం చేసిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి చెప్పారు. పంపిణీ చేసిన పోడు భూములను వ్యవసాయయోగ్యంగా తీర్చిదిద్ది వారికి అన్ని విధాలుగా అండగా నిలవాలని సూచించారు. ఒకేసారి 1.50 లక్షల మందికి నాలుగు లక్షల ఎకరాలను ఏకకాలంలో ఇవ్వటంలో అభినందనీయమని ప్రశంసించారు.
చిత్తశుద్ధికి నిదర్శనం: పల్లా రాజేశ్వర్రెడ్డి
దశాబ్దాలుగా తమ జీవనోపాధికి మూలాధారమైన భూములకు పట్టాలు ఇవ్వాలని గిరిజనులు కోరుతున్నా ఏ ప్రభుత్వమూ పట్టించుకోలేదని, అదే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చిందని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇటీవల పంపిణీ చేసిన పోడుభూముల పంపిణీయే నిదర్శనమని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం భారీ ఎత్తున నిధులను కేటాయిస్తూ, ఖర్చు చేస్తున్నదని తెలిపారు.
గిరిజన సంక్షేమం భేష్: ఏవీఎన్ రెడ్డి
రాష్ట్రంలో గిరిజన సంక్షేమం కోసం ప్రభు త్వం చేస్తున్న కృషిని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అభినందించారు. గిరిజన విద్యాలయాల్లో కొన్ని సమస్యలున్నాయని, వాటికి పరిష్కరించేందుకు మరింత చొరవ చూపాలని సూచించారు.
ప్రభుత్వానికి కృతజ్ఞతలు: తాతా మధు
రాష్ట్రంలో పంచిన పోడుపట్టాల్లో అత్యధికంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లావే కావడం పట్ల ఎమ్మెల్సీ తాతా మధు హర్షం ప్రకటించారు. ఆయన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. పోడుపట్టాల పంపిణీ చరిత్రలో నిలిచిపోయే ఘట్టమని ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, రఘోత్తంరెడ్డి తెలిపారు.
ఆత్మగౌరవ అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్సీ కవిత
గిరిజనులు ఆత్మగౌరవం తో అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా గిరిజన జనాభా దామాషాకు అనుగుణంగా 6 శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచిందని తెలిపారు. 175 విద్యాసంస్థలను ప్రత్యేకంగా ఆదివాసీలు, గిరిజనుల కోసం సీఎం కేసీఆర్ ఏర్పాటు చేశారని చెప్పారు. గిరిజన గురుకులాల్లోని విద్యార్థుల్లో 367 మంది ఐఐటీ, ఐఐఎం సంస్థల్లో చేరారని, 456 మంది నిట్, ట్రిఫుల్ ఐటీలో అడ్మిషన్లు సాధించారని, 2087 మంది ఇంజినీరింగ్ కోర్సుల్లో చేరారని, 266 మంది మెడికల్ కాలేజీల్లో చేరారని ఆమె వివరించారు. గిరిజన బిడ్డలకు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తుండటం వల్లే నిజామాబాద్ జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ చిన్న వయస్సులో మౌంట్ ఎవరెస్టును అధిరోహించి ప్రపంచ రికార్డును సొంతం చేశారని ఉదాహరించారు. గిరిజనులు పారిశ్రమికవేత్తలుగా ఎదగడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహకాలు అందిస్తున్నదని తెలిపారు.
సొంతబిడ్డలుగా గిరిపుత్రులు: ఎమ్మెల్సీ గోరటి
గిరిపుత్రులను సొంతబిడ్డలుగా భావించిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ప్రశంసించారు రు. పోడు భూములకు గిరిజనులను యజమానులుగా చేసిన దార్శనిక ప్రభుత్వం కేసీఆర్ది అన్నారు. కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఏపీ ఇలా అనేక రాష్ర్టాల్లో అటవీభూములపై తమకు హక్కులు కావాలని ఎంతోకాలంగా పోరాటాలు సాగుతున్నా ఆయా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని పేర్కొన్నారు. అదే తెలంగాణలో అడవిబిడ్డలను అక్కున చేర్చుకొని పోడు పట్టాలు ఇవ్వడంతోపాటు వారి సర్వతోముఖాభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు.