Telangana Decade Celebrations | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజనోత్సవాలను ఘనంగా నిర్వహించాలని, సం బురాలు అంబరాన్నంటాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. ఉత్సవాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు.
శతాబ్ద కాలంగా నెరవేరని గిరిజనుల కలలను సీఎం కేసీఆర్ దశాబ్ద కాలంలో నెరవేర్చారని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పు తెచ్చిన కేసీఆర్ గిరిజన జాతికి ఎప్పటికీ ఆరాధ్యుడిగా ఉంటారని పేర్కొన్నారు. పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించి, గిరిజనుల అభివృద్ధి, వారికి అందుతున్న సంక్షేమ ఫలాలను రాష్ట్రవ్యాప్తంగా తెలిసేలా జరుపుకోవాలని కోరారు.