జయశంకర్ భూపాలపల్లి, అక్టోబర్ 21(నమస్తే తెలంగాణ) : చేపల ఎగుమతిలో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో జడ్పీటీసీ జోరుక సదయ్య అధ్యక్షతన ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. కార్యక్రమానికి మంత్రి సత్యవతి, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, భూపాలపల్లి పార్టీ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ముదిరాజ్ కులస్థుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తూ ఉచితంగా చేపపిల్లలను పంపిణీ చేయడమే కాకుండా వారికి సబ్సిడీపై వాహనాలను అందించి ప్రోత్సహించినట్టు తెలిపారు. దీంతో తెలంగాణ చేపలను ఎగుమతి చేసే స్థాయికి చేరిందని పేర్కొన్నారు. ముదిరాజ్ల అభ్యున్నతి గురించి ఆలోచించింది సీఎం కేసీఆర్ ఒక్కరేనని కొనియాడారు. ఇంతకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఇప్పుడు మళ్లీ ఓటు వేయాలంటూ వస్తున్నారని, వారు ఏం చేశారో నిలదీయాలని సూచించారు.
గండ్రకు వేసే ప్రతి ఓటు నాకు వేసినట్టే : బండా ప్రకాశ్
బీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డికి ముదిరాజ్లు వేసే ప్రతి ఓటు తనకు వేసినట్టుగా భావించాలని మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ అన్నారు. గండ్ర తో తనకు 30 ఏండ్ల అనుబంధం ఉన్నదని అన్నారు. ఆయన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. తెలంగాణ రాక ముందు 2వేల సొసైటీలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఆ సంఖ్య 5వేలకు చేరిందని అన్నారు. కేసీఆర్తోనే బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. సమావేశంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర కార్యదర్శి పల్లెబోయిన అశోక్, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు బండి సారంగపాణి తదితరులు పాల్గొన్నారు.