ములుగు : రాష్ట్రంలో సబ్బండ వర్ణాలు సంబురపడేలా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavati Rathode) అన్నారు. వందేండ్లలో జరగని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్(Cheif Minister) నాయకత్వంలో పదేళ్లలోనే జరిగిందని పేర్నొన్నారు.
శుక్రవారం ములుగు జిల్లా మంగపేట మండలం, బాలన్నగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు-మనబడి(Mana Ooru-Mana Badi)కార్యక్రమంలో భాగంగా రూ. 63. 65 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతుల అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. మంగపేటలో రెవెన్యూ అతిథి గృహ భవనాన్ని, కంపోనిగూడెంలో ప్రభుత్వ గిరిజన ఫిల్లింగ్ స్టేషన్ను, చిల్లి ప్రాసెసింగ్ యూనిట్ ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు.
జూన్ మొదటి వారంలో మంత్రి కేటీఆర్(Minister KTR) చేతుల మీదుగా ములుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి శంకుస్థాపన, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోబోతున్నామని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ములుగు జిల్లాను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద కేజీ టూ పీజీ ఉచిత విద్య అందేలా విద్యాసంస్థల్ని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. జూన్ 24 నుంచి 30 తేదీ వరకు పొడు పట్టాలు అందించబోతున్నామన్నారు.ఇంటి స్థలం ఉన్నవారు గృహ నిర్మాణ పథకం కింద రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారని తెలిపారు. జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వివరించారు.