మహబూబాబాద్ : పేదలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తుందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కల్పిస్తున్న అధునాతన వైద్య సేవల(Advance Medical Service)ను పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.
మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో 134 రకాల పాథాలజీ పరీక్షలను అప్గ్రేడ్ చేసే కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం హైదరాబాద్ నుంచి మంత్రి హరీశ్ రావు వర్చువల్ మోడ్ ద్వారా నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ వైద్యో నారాయణ హరి’ అంటారని, అంటే వైద్యుడు ఆ దేవుడితో సమానమని అన్నారు . మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సమయంలో అవసరమైన వైద్యం అందించి పునర్జన్మను ప్రసాదించటంతో వైద్యులు హరితో సమానంగా భావిస్తారని తెలిపారు.
మహబూబాబాద్ జిల్లాలో రెండు కోట్లతో డయాగ్నోస్టిక్స్ సెంటర్(Diagnostics Center) ను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు , వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు కోసం వెళితే ప్రైవేట్ ల్యాబ్ లకు రాసేవారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చాక పేద ప్రజలకు అధునాతన వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిందని వెల్లడించారు.వైద్యుల దినోత్సవం సందర్భంగా నర్సులకు హ్యాండ్ బ్యాగులను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ , జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక తదితరులు పాల్గొన్నారు.