హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ఉచిత హామీలను రాష్ట్ర ప్రజల నమ్మరని, సోనియాగాంధీవి బూటకపు హామీలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. తుకుగూడ కాంగ్రెస్ విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలపై ఆమె ఒక ప్రకటనలో స్పందించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు లక్షల రైతు రుణమాఫీ అని ప్రకటించినా, ప్రజలు మాత్రం కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటనకే పట్టం కట్టారని గుర్తు చేశారు. అమలు చేయని హామీలనే కాంగ్రెస్ ప్రకటిస్తుందని, కాంగ్రెస్ చెయ్యి గుర్తు పార్టీ అని, అంటే ఏమీ చెయ్యని గుర్తు అన్న విషయం ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో 4వేల పింఛన్ ఇస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, రుణమాఫీ, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఏ ఒకటైనా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా అని నిలదీశారు. కాంగ్రెస్ది మాటల ప్రభుత్వమని, బీఆర్ఎస్ది చేతల ప్రభుత్వమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలు, తప్పుడు ప్రకటనలను తెలంగాణ మహిళలు విశ్వసించరని మంత్రి సత్యవతి రాథోడ్ తేల్చి చెప్పారు.