వరంగల్, జూలై 2(నమస్తేతెలంగాణ): దేశంలోనే గిరిజనులకు తొలిసారిగా పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి సీఎం కేసీఆర్ తెలంగాణను యావత్ దేశానికి రోల్మాడల్గా నిలిపారని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 4,06,369 ఎకరాల పోడు భూములకు సంబంధించి 1,51,730 మంది లబ్ధ్దిదారులకు ఒకేసారి పట్టాలు ఇవ్వడమనేది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పారు. దశాబ్దాల పోడు భూముల సమస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపించి అడవి బిడ్డలను యజమానులుగా చేశారని తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా నర్సంపేటలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో 3,271 మంది గిరిజనులకు 7,333 ఎకరాల భూమికి పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతిరాథోడ్ మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు పోడు హక్కు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గిరిజనుల చిరకాల కోరికను నెరవేర్చిన గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. పోడు చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో 2016 వరకు 3.8 లక్షల ఎకరాలకు మాత్రమే పోడు పట్టాలను పంపిణీ చేస్తే.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ 4,06,369 ఎకరాలను 1,51,146 మంది పోడు రైతులకు పంపిణీ చేశారని ఆమె పేర్కొన్నారు. పోడు పట్టాలతో పాటు లబ్ధిదారులకు రైతుబంధు, రైతు బీమా పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య, ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్, మాజీ ఎంపీ సీతారాంనాయక్ తదితరులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 2 (నమస్తే తెలంగాణ): పోడు పట్టాల పంపిణీతో గిరిజన గూడేల్లో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. పట్టాలు అందుకుంటున్న గిరిజనులు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఆదివారం భద్రాద్రి జిల్లాలోని పినపాక, అశ్వాపురం, బూర్గంపాడు, టేకులపల్లి మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో పోడు రైతులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. జిల్లావ్యాప్తంగా 50,595 మందికి పట్టాలు పంపిణీ చేయాల్సి ఉండగా ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు గతనెల 30న పాల్వంచలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి 2,500 మందికి పట్టాలు పంపిణీ చేశారు. మిగిలిన వారికి సోమవారం నుంచి ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు పట్టాలు పంపిణీ చేయనున్నారు.
మా కుటుంబం 25 సంవత్సరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్నది. పోడు భూమికి పట్టా వస్తదని ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నం. భూమిని కాపాడుకోవడానికి ఎన్నోసార్లు దెబ్బలు తిన్నం. పోడు పట్టా రాదనుకున్నం. కానీ సీఎం కేసీఆర్ సారు దేవుడై మాకు వరమిచ్చాడు. పోడు రైతులకు పట్టాలు ఇస్తున్నడు. ఇంతకుముందు ఎంతో మందికి మొరపెట్టుకున్నా, మా బాధలు ఎవరూ పట్టించుకోలేదు. సీఎం కేసీఆర్ మాత్రం మాపై దయ చూపించి పట్టాలు ఇప్పిస్తున్నడు.
– తాటి లక్ష్మీభాయి, బండ్లవారి గుంపు, అశ్వాపురం మండలం, భద్రాద్రి జిల్లా