యాదాద్రి: కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన అధికారాలు, సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా సీఎం కేసీఆర్ చేపట్టిన దేశ యాత్ర దిగ్విజయం కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ (Satyavathi rathod) ఆకాంక్షించారు. శనివారం ఉదయం కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న మంత్రి.. లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు మంత్రికి వేదాశీర్వచనం చేశారు. అంతకుముందు ఆలయ అధికారులు మంత్రి సత్యవతికి ఘనస్వాగతం పలికారు.
అనంతరం మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. యాదాద్రి నిర్మాణం అనంతరం స్వామివారి ఆలయం అద్భుతంగా ఉందని చెప్పారు. మహా సంప్రోక్షణకు రాలేకలేకపోయానని, అందువల్ల స్వామి వారిని దర్శించుకునేందుకు కుటుంబసమేతంగా వచ్చినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ హక్కులను కేంద్రం హరిస్తుందన్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ నడుంబిగించారని చెప్పారు. ఈ నేపథ్యంలోని వివిధ రాష్ట్రాల నాయకులతో సీఎం వరుసగా సమావేశమవుతున్నారని వెల్లడించారు. సీఎం చేపట్టిన యాత్ర జయప్రదం కావాలని ఆకాంక్షించారు.