భద్రాద్రి: భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామివారిని మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం భద్రాచలం వెళ్లిన వారు లక్ష్మణ సమేత సీతారామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో వారికి పండితులు వేదాశీర్వచంనం అందించారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకు ముందు రాములవారి క్షేత్రానికి వచ్చిన వారికి ఆలయ ఈవో శివాజీ స్వాగతం పలికారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని స్వామివారిని కోరుకున్నట్లు చెప్పారు.
టీఆర్ పార్టీ సంస్థాగత నిర్మాణం కొనసాగుతుందని వెల్లడించారు. ఇప్పటికే గ్రామ కమిటీలు వేసుకున్నామని, 60 లక్షల మంది కార్యకర్తలతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. రేపటినుంచి మండల కమిటీలు వేసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన ఏడేండ్లలోనే దేశం గర్వించేలా అభివృద్ధి చెందిందని వెల్లడించారు.