హైదరాబాద్: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం 1100 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతులు రావడంతో చారిత్రక వరంగల్ నగరం మెడికల్ హబ్గా అవతరించబోతోందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ వైద్యారోగ్య రంగం పటిష్టం అవుతోందన్నారు. ఇందుకు సహకరిస్తున్న మంత్రులు కేటీఆర్, హరీష్ రావుకు వరంగల్ ప్రజల పక్షాన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.
హైదరాబాద్కు దీటుగా వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నిజం అవుతున్నాయని మంత్రి అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించేందుకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో, అధునాతన వైద్య సదుపాయాలతో వరంగల్ నగరంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.. అద్భుతమైన హాస్పిటల్ కోసం డిజైన్లు రూపొందించి, దాని నిర్మాణం కోసం 1100 కోట్ల రూపాయలకు అనుమతులు ఇవ్వడం ఇక్కడి ప్రజల పట్ల సీఎంకు ఉన్న ప్రేమకు నిదర్శనమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఈ 158 జీవోలో సివిల్ వర్క్స్ కు రూ.509 కోట్లు.. మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, చట్టబద్ధమైన పనులు, పన్నుల కోసం రూ.229.18 కోట్ల నిధులను కేటాయించారని ఆమె తెలియజేశారు. అత్యంత వేగంగా ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేయాలని సీఎం ఆదేశించడంతో త్వరలోనే ఓరుగల్లు ప్రజలకు ఉత్తమమైన వైద్యం అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు.