Minister Satyavathi Rathod | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉత్పన్నమైనా.. సమర్థవంతంగా ఎదుర్కొనేలా అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో మంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహిచంఆరు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని.. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది, అధికారులు ఎవరూ కూడా సెలవుల్లో వెళ్లకూడదని.. పూర్తి అప్రమత్తతో విధులు నిర్వహించాలని అన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా సత్వర చర్యలు తీసుకోవాలని, వరద ఉధృతి తగ్గిన వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టి వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.
వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి ఏదైనా సమాచారం కంట్రోల్ రూమ్కు అందిన వెంటనే సహాయక చర్యలు చేపట్టేలా సిబ్బందిని సమాయత్తపర్చాలని మంత్రి అధికారులకు తెలిపారు. విద్యుత్ ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కుంభవృష్టి కురవడంతో చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముఖ్యంగా చేపలు పట్టే వారు, ఈత సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగులోకి దిగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.