మహబూబాబాద్: శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీసు (Telangana police) వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. పోలీసులు ప్రజలతో మెరుగైన సంబంధాలు ఏర్పర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడంలో విజయం సాధిస్తున్నారని చెప్పారు. గత తొమ్మిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసుతోపాటు పోలీసు శాఖలో అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేసి ప్రజలకు భద్రత కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో (Telangana decade celebrations) భాగంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సురక్ష దినోత్సవ (Suraksha dinotsavam) కార్యక్రమాన్ని మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు శాఖకు సీఎం కేసీఆర్ (CM KCR) ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని త్వరగా కేసులు ఛేదిస్తున్నారని వెల్లడించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల కోసం ప్రవేశపెడుతున్న ప్రతి పథకాన్ని కేంద్ర ప్రభుత్వంతోపాటు
ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నారని తెలిపారు. హోంగార్డులకు గౌరవ వేతనం 30 శాతం పెంచిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. సురక్షా వేడుకల్లో భాగంగా శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, స్నేహపూర్వక విదానాలను ప్రజలకు వివరించేందుకు పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.