హైదరాబాద్ : ప్రత్యేక పద్దు చట్టం-2017 కింద గిరిజన జనాభాకు అనుగుణంగా ఆయాశాఖలను కేటాయించిన నిధులను సద్వినియోగం చేయాలని గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్లో ఎస్టీ ప్రత్యేక పద్దు (ఎస్డీఎఫ్) నోడల్ ఏజెన్సీ జరగ్గా.. 28శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయాశాఖల పరిధిలో పథకం అమలుపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్టీ ఎస్డీఎఫ్ కింద కేటాయించిన నిధుల వినియోగంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. అయితే, ఎస్టీ ఎస్డీఎఫ్ కింద రూ.6672కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు వివరించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి, సమగ్ర వికాసం కోసం కేటాయించిన నిధులను ఖర్చు చేయడంతో పాటు లబ్ధిదారుల జాబితా, రోడ్లు, కమ్యూనిటీ అభివృద్ధి కోసం చేసిన ఖర్చుల వివరాలను సవివరంగా సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ గిరిజను అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని నిధులు కేటాయిస్తున్నారని, వాటిని సద్వినియోగం చేస్తూ వారి ప్రగతి కోసం పాటుపడాలని సూచించారు. సమావేశానికి సంబంధిత శాఖల ఉన్నతాధికారులు ఖచ్చితంగా హాజరై నిధుల ఖర్చు, వారికి ఉన్న సమస్యలు తెలుపాలని చెప్పారు. సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్ క్రిస్టినా జెడ్ చొంగ్తు, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య దేవరాజన్, గురుకులాల కార్యదర్శి రోనాల్డ్ రాస్, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.