హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాలానుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సభా నియమాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అభిప్రాయపడ్డారు. సభ్యులు ప్రజా సమస్యలను సభలో సమర్థంగా ప్రస్తావించేందుకు, అర్థవంతమైన చర్చలు జరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేలా నిబంధనలు ఉండాలని సూచించారు.
తెలంగాణ శాసనమండలిలోని కమిటీ హాల్లో రూల్స్ కమిటీ ప్రాథమిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల గౌరవం, ఔన్నత్యాన్ని కాపాడటంలో సభా నియమాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనమండలిని ఆదర్శంగా నిలిపేందుకు సభ్యులందరూ సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రూల్స్ కమిటీ సభ్యులు పలు అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలను వెల్లడించారు. సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్తోపాటు సభ్యులు శంకర్నాయక్, శ్రీపాల్రెడ్డి, తీన్మార్ మల్లన్న, మంకెన కోటిరెడ్డి, బస్వరాజు సారయ్య, మలా కొమురయ్య, నెల్లికంటి సత్యం, శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.