మహబూబాబాద్ : యాసంగింలో పండించిన వరి ధాన్యం సేకరణకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్.. కలెక్టర్ శశాంకతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. యాసంగిలో పండించిన వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. గత అనుభవాల నేపథ్యంలో ఈసారి ధాన్యం కొనుగోలులో ఇబ్బందులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు. రైస్ మిల్లర్లు కూడా రైతులకు సంపూర్ణంగా సహకరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అందరూ కలిసి పని చేయాలన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే డబ్బులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు త్వరలోనే వస్తాయని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.