హైదరాబాద్ : వరంగల్ ఎంజీఎంలో ఆత్మహత్యకు యత్నించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్యం మెరుగుపడిందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. నిమ్స్లో చికిత్స పొందుతున్న ప్రీతిని మంత్రి సత్యవతి శుక్రవారం పరామర్శించారు, ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఎక్మోపైనే ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో మాట్లాడారు. ప్రీతి ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందుతోంది.. గత రెండు రోజుల కంటే పరిస్థితి మెరుగుపడిందని మంత్రి తెలిపారు. వరంగల్ ఎంజీఎంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని నియమించిందని పేర్కొన్నారు. బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. వారికి తప్పకుండా శిక్ష విధిస్తామన్నారు. ప్రీతి ఆరోగ్యంపై గంట గంటకూ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిమ్స్ వైద్యులతో సమీక్షిస్తున్నారని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ప్రీతి కోలుకున్న అనంతరం పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారని మంత్రి సత్యవతి తెలిపారు.