హైదరాబాద్ : సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి, హత్య చేసిన దుర్ఘటనపై రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై వెంటనే విచారణ చేపట్టి నిందితుడిని పట్టుకుని కఠిన శిక్ష పడేలా తక్షణ చర్యలు చేపట్టాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, ప్రత్యేక కమిషనర్ దివ్య దేవరాజన్, సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్తో మంత్రి మాట్లాడి ఆదేశాలిచ్చారు. ఆ బాలిక కుటుంబాన్ని(బాలిక తల్లిదండ్రులు సబావత్ రాజు, జ్యోతి) ఆదుకునేందుకు వెంటనే రూ. 50 వేలు అందించాలని ఆదేశించారు. చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన పల్లంకొండ రాజుపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్, పోలీస్ కమిషనర్ మంత్రికి వివరించారు.
తెలంగాణలో మహిళలు, బాలికల రక్షణకు షీ టీమ్స్, భరోసా కేంద్రాలు, సఖీ కేంద్రాలు పెట్టి భద్రత కల్పిస్తుండగా, అక్కడక్కడా ఇలాంటి ఘటనలు జరగడం తల్లిదండ్రుల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాయన్నారు. ఇలాంటి దుర్మార్గాలను ఉక్కుపాదంతో అణచివేయాలని మంత్రి సత్యవతి రాథోడ్ అధికారులకు సూచించారు. కాలనీ వాసులు సంయమనం పాటించాలని, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని, బాలిక కుటుంబానికి న్యాయం చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు.