ములుగు: బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు, జిల్లా జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్ (Kusuma Jagadish) అంతిమయాత్ర కొనసాగుతున్నది. జగదీశ్ పార్థీవ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పుష్పాంజలి ఘటించారు. ఆయన భౌతికకాయంపై బీఆర్ఎస్ పార్టీ జెండా కప్పారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రస్తుతం ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్తోపాటు మంత్రులు పువ్వాడ అజయ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod), జగదీశ్ రెడ్డి, ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్.. జగదీశ్ పాడెను మోశారు. కుసుమ జగదీశ్ ఆదివారం మధ్యాహ్నం గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే.