హైదరాబాద్ : కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని తెలంగాణ గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కర్ణాటక కలబురిగి జిల్లాలో జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు బాలరాజ్ శివగుత్తేదార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. బీఆర్ఎస్కు జేడీఎస్ మద్దతు ఇవ్వడం ఎంతో
సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ రైతు పాలసీ, జలవిధానం తదితర నూతన పాలసీలను
రూపొందించారన్నారు. రాబోయే కర్ణాటక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున సీఎం కేసీఆర్తో తామంతా ప్రచారం
చేస్తామన్నారు. కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలని ఆమె ఆకాంక్షించారు.
కేసీఆర్ దేశంలో పరివర్తన కోసమే బీఆర్ఎస్ ఏర్పాటు చేశారన్నారు. ఎనిమిదేళ్లలో దేశమంతా ఆశ్చర్యపోయేలా తెలంగాణలో ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతుబీమా వంటి అనేక పథకాలను అమలు అవుతున్నాయనిఅన్నారు. దేశ జీడీపీ పెంచమంటూ, బీజేపీ ప్రభుత్వం గ్యాస్, డీజీల్, పెట్రోల్ ధరలు పెంచి ప్రజల నడ్డి విరుస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ పాలన అంటూ గొప్పలు చెప్పే బీజేపీ.. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉందని, కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అందిస్తున్న ప్రజా, రైతు సంక్షేమ పథకాలు ఏవీ అక్కడి ప్రజలకు అందడం లేదన్నారు.
కర్ణాటకలో అత్యధికంగా గిరిజనులు వెనుకబడిన వర్గాల వారు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని మంత్రి ప్రశ్నించారు. తెలంగాణలో రూ.2,016 పింఛన్ అందుతుందని, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం కేవలం రూ.600 ఇస్తుందన్నారు. చించోళి, బంగూరులలో ఇంటింటికి నల్ల నీరు రావడంలేదన్నారు. కర్ణాటక రైతులకు బావులు, బోర్లకు ఉచిత కరెంటు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులకు కేవలం ఐదారు గంటలు మాత్రమే కరెంట్ రావడంతో తాగు, సాగునీటికి ఇక్కడి వారి అనేక కష్టాలు పడుతున్నారన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా కల్యాణ లక్ష్మి, ఆరోగ్యలక్ష్మి, వంటి అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం జరిగిందని దీంతో గిరిజనులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరిగాయని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయని, సంక్షేమాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్కు మద్దతుగా నిలువాలని మంత్రి కోరారు.