మహబూబాబాద్: స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2కే ఫ్రీడమ్ రన్ను ఎంపీ కవితతో కలిసి మంత్రి సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎంతోమంది మహనీయుల వీరోచిత పోరాటం, వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం లభించిందని చెప్పారు. మహాత్ముడు అహింసా మార్గంలో స్వాతంత్య్ర పోరాటాన్ని సాగించారని తెలిపారు. గాంధీజీ ఉద్యమ స్ఫూర్తిని వర్తమాననికి, భావితరాలకు అందించాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పని వెల్లడించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేండ్లయినప్పటికీ ఇంకా కొన్ని ప్రాంతాల్లో విపక్ష, వెనుకబాటుతనం ఉందని మంత్రి అన్నారు. దాన్ని రూపుమాపాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు ఉండాలనేది ముఖ్యమంత్రి ఆకాంక్ష అని చెప్పారు. 75 సంవత్సరాలలో దేశంలో ఏ రాష్ట్రం సాధించని విజయాలను ఎనిమిదేళ్లలో తెలంగాణ సాధించి చూపిందని వెల్లడించారు.