హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): గిరిజన ఓట్ల కోసం కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో రెండు నెలల్లో ఎన్నికలు ఉండటంతో ఇప్పుడు గిరిజనులపై కపట ప్రేమ నటిస్తున్నదని విమర్శించారు. యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ 2014 నుంచి అనేక పర్యాయాలు ప్రధాని మోదీని కలిసి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా జాకారంలో 335.04 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని తెలిపారు. అయినా ఫలితం లేకపోడంతో కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, వెలుపల ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు గిరిజనుల ఓట్ల కోసమే యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించిందని విమర్శించారు. ఈ పదేండ్లలో వర్సిటీ ఏర్పాటు చేయకపోవడంతో గిరిజన విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. గిరిజన వర్సిటీ ఏర్పాటు పై కేంద్రం వివక్ష చూపినా.. సీఎం కేసీఆర్ గిరిజన వర్సిటీ కోసం 2019 జనవరి 11న ఎస్టీఎస్డీఎఫ్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) నుంచి రూ.15 కోట్ల బడ్జెట్ను కేటాయించారని తెలిపారు. డీపీఆర్ రూపొందించేందుకు 2019-20 బడ్జెట్లో రూ.4 కోట్లు కేటాయించినట్టు గుర్తు చేశారు. ములుగు జిల్లా జాకారంలోని గిరిజన సంక్షేమ శాఖ యువ శిక్షణా కేంద్రం (వైటీసీ)ను తాత్కాలిక ప్రాంగణంగా స్వీకరించాలని కేంద్ర విద్యాశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించిందని గుర్తుచేశారు. ఎన్నికల వేళ బీజేపీ కుట్రలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమని అన్నారు.