మహబూబాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంపై ఆమె మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి రైతులపై ప్రేమ లేదనే విషయం స్పష్టమైందని పేర్కొన్నారు. గురువారం ఆమె మహబూబాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం దుర్మార్గపు చర్యగా ఆమె అభివర్ణించారు. రైతు సంక్షేమాన్ని ఉద్దేశించిన రైతుబంధును అడ్డుకోవడంలో ఆ పార్టీ నేతల ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజా సంక్షేమ పథకాలను అడ్డుకునే పార్టీ కాంగ్రెస్ అని మరోసారి రుజువైందని విమర్శించారు. సాగు, తాగు, సంక్షేమ రంగాలను సమానంగా అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దకుతుందని కొనియాడారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా కీలక సంక్షేమ పథకాలను కేసీఆర్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు.