హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం గిరిజనులకు అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచిన కేంద్రం ఆమోదం తెలుపలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేశారని తెలిపారు. బుధవారం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో మంత్రి మాట్లాడారు. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనుల అంశాలపై చర్చకు ఏకంగా ఒక్కరోజు అవకాశం ఇచ్చారంటే వారి అభివృద్ధిపై సీఎం కేసీఆర్కు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. తండాలను పంచాతీయలుగా చేయడమేకాక వారి విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. రూ.2 కోట్లతో బంజారాహిల్స్లో బంజారా, ఆదివాసీ భవనాలను ఏర్పాటుచేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. గిరిజన ప్రాంతాలైన ములుగు, మహబూబాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్కు గిరిజనుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా చోంగ్తూ, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శంకర్నాయక్, బానోత్ హరిప్రియ నాయక్, హైదరాబాద్ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి, కార్పొరేటర్ మన్నే కవితరెడ్డి, ట్రైకార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యా నాయక్, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.