మోదీ.. ఈ దేశ ప్రధాన మంత్రి! అయినా..
గుజరాత్కే ముఖ్యమంత్రినని భావిస్తూ..
ఆ రాష్ర్టానికే నిధుల వరద పారిస్తూ, భారీ
ప్రాజెక్టులను అడక్కుండానే వరాల్లా ఇచ్చేస్తుంటారు.
ఇదే మోదీ క్యాబినెట్లోని ఉత్తరాది రాష్ర్టాల మంత్రులు సైతం తమ రాష్ర్టాలకు ప్రయోజనాలు కల్పించేందుకు
అమితాసక్తి ప్రదర్శిస్తారు! ఏ మాత్రం వీలున్నా తమ
రాష్ర్టాలకు నిధులు, ప్రాజెక్టులు రాబడుతారు.
ఇదే మోదీ క్యాబినెట్లో మన దగ్గర నుంచీ ఘనత వహించిన కేంద్ర మంత్రి ఉన్నారు. ఆయన పేరు కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ నుంచి లోక్సభకు గెలిచి.. తెలంగాణ కోటాలో కేంద్ర మంత్రి పదవి కొట్టేసినా.. ఆయనకు ఆ కృతజ్ఞత కూడా లేకుండా పోయింది! రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న సోయి లేనేలేదు!
తనంతట తానుగా రాష్ర్టానికి నిధులో, ప్రాజెక్టులో తెప్పించాల్సింది పోయి.. సాక్షాత్తూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను సైతం నెరవేర్చలేని అశక్తుడిగా నిరూపించుకున్నారు. కేంద్రంలో కిషన్రెడ్డి పరపతి ఎంతో ప్రతి సందర్భంలోనూ బయటపడుతూనే ఉన్నది. మొన్నటికి మొన్న హైదరాబాద్లో ఏర్పాటుచేస్తామన్న అంతర్జాతీయ సంప్రదాయ వైద్యకేంద్రాన్ని కేంద్రం గుజరాత్కు తరలించుకుపోతుంటే, ఇదే కిషన్రెడ్డి కండ్లు మూసుకున్నారు. ఇప్పుడేమో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ కట్టేది లేదని కుండబద్దలు కొట్టారు. నాలుగేండ్ల కిందట సానుకూల నిర్ణయం తీసుకుంటామని అప్పటి కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ చేసిన ప్రకటనను సాధించుకోలేని నిస్సహాయత మన కిషన్రెడ్డిది.
మోదీ పాలనలో విభజన హామీలకు దిక్కులేదు.
పార్లమెంట్ సాక్షిగా చేసిన చట్టాలకు దిక్కులేదు.
తెలంగాణ అంటేనే బీజేపీకి కసి, కక్ష, నిత్యం వివక్ష
బయ్యారాన్ని బొందపెట్టడమే కుటిల నీతికి పరాకాష్ట
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం నెలకొల్పకపోతే తెలంగాణలో బీజేపీకి గోరీ కడతామని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం ఆమె టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు అని స్పష్టంచేశారు. కేంద్రం తేల్చకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. తెలంగాణ చరిత్ర, ప్రజల ఆకాంక్షలు పట్టని కిషన్రెడ్డి కేంద్రంలో ఉత్సవ విగ్రహంగా ఉన్నారని మండిపడ్డారు.
ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్షా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను కాలరాస్తుంటే కిషన్రెడ్డి తలూపుతున్నారని మండిపడ్డారు. బయ్యారం ముడి ఇనుములో నాణ్యత లేకపోతే వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు రక్షణ స్టీల్కు బయ్యారం ఉక్కు పరిశ్రమ కోసం భూములను ఎందుకు కేటాయించారని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని స్థాపిస్తామని కేంద్రం ఎందుకు హామీ ఇచ్చిందని నిలదీశారు. మోదీ, అమిత్షా చెప్పినట్టు వింటూ గిరిజన యువతను, తెలంగాణ సమాజాన్ని కిషన్రెడ్డి తప్పుదారి పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై తిరుగుబాటు చేయకముందే మేల్కొనపోతే ఆ పార్టీకి గోరీ కట్టడం ఖాయమని హెచ్చరించారు.
రాష్ర్టానికి ఏమీ చేయని కిషన్రెడ్డి వల్ల లాభమేమిటని నిలదీశారు. బీజేపీ నేతలకు సొంత పనులపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంపై లేదని ధ్వజమెత్తారు. ఏపీలో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణలో విస్మరిస్తే కిషన్రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బయ్యారంలో 100-150 ఏండ్లకు సరిపడా నాణ్యమైన ముడి ఇనుము నిల్వలు ఉన్నాయంటూ గతంలో జాతీయ సంస్థలు చెప్పాయని వివరించారు. బీజేపీ తీరు మారకపోతే ఆ పార్టీకి బయ్యారంలో సమాధి కడతామని హెచ్చరించారు.
ఉపాధి కోరితే ఉరితాళ్లా?: ఎంపీ కవిత
తెలంగాణ గిరిజన యువతకు ఉపాధి చూపాలని అడిగితే ఉరితాళ్లు చూపుతారా? అని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత నిలదీశారు. రాష్ర్టానికి మేలు చేయని కిషన్రెడ్డి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన బిడ్డల ఆకాంక్షలను పట్టించుకోని బీజేపీలో ఎందుకు ఉండాలో ఆ పార్టీ నేతలు తేల్చుకోవాలని చెప్పారు. ఎంతమంది అడ్డుపడ్డా రాష్ర్టాన్ని సాధించిన స్ఫూర్తితోనే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని సాధిస్తామని చెప్పారు.
తెలంగాణపై అక్కసు: రెడ్యానాయక్
ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించడం లేదని కిషన్రెడ్డి చెప్పడం బాధ్యతా రాహిత్యమని ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మండిపడ్డారు. తెలంగాణపై, కేసీఆర్పై కండ్ల మంటతోనే మోదీ బయ్యారం ఫ్యాక్టరీని అడుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ కావడం ఇష్టంలేకనే బీజేపీ ఈ ప్రాంతంపై ద్వేషం పెంచుకొన్నదని చెప్పారు. రైల్వే, రోడ్డు రవాణా వ్యవస్థ లాంటి అనుకూలతలు ఉన్నాయని గతంలో వచ్చిన నివేదికలను కిషన్రెడ్డి చదువుకోవాలన్నారు.
స్టీల్ ప్లాంట్ సాధ్యంకాదు
బయ్యారంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ రద్దు చేశాం. కేంద్రానికి సాధ్యం కానప్పుడు ఎలా ముందుకెళ్లగలం? స్ట్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై గత ఎన్నికల సందర్భంగా బీజేపీ ఎలక్షన్ మ్యానిఫెస్టోలో వాగ్దానం చేసింది నిజమే.
-ఇదీ కిషన్రెడ్డి మాట
ఏ ఆధారంతో ప్రకటిస్తారు?
ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం సాధ్యం కాదంటూ కిషన్రెడ్డి చేసిన ప్రకటన ప్రజలను మోసపుచ్చేలా ఉన్నది. ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ ఎనిమిదేండ్ల కిందటే నివేదికలు ఇచ్చింది. వాటిని పక్కనబెట్టి కిషన్రెడ్డి ఏ ఆధారంతో సాధ్యం కాదని ప్రకటిస్తారు. కేంద్రంలోని బీజేపీ విధానాలపై ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటాం.
-మంత్రి పువ్వాడ
బీజేపీకి గోరీ కట్టుడు ఖాయం
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని కేంద్రం ఏర్పాటుచేయకపోతే తెలంగాణలో బీజేపీకి గోరీ కడతాం. ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేమన్న వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఉపసంహరించుకొని ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. బయ్యారం ఉక్కు-తెలంగాణ హక్కు. కేంద్రం తేల్చకపోతే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తాం.
– మంత్రి సత్యవతి రాథోడ్
న్యాయ పోరాటానికైనా సిద్ధం
‘బయ్యారం ఉక్కు పరిశ్రమ సాధనకు కేంద్రంపై న్యాయ పోరా టం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు మంత్రి కేటీఆర్ ఒత్తిడి తెచ్చారు. తెలంగాణపై కేంద్రానికి పక్షపాత ధోరణి ఉందనటానికి కిషన్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం.
– హరిప్రియానాయక్, ఇల్లెందు ఎమ్మెల్యే
మానుకోట హక్కు
బయ్యారం ఉక్కు.. మానుకోట హక్కు. ఈ విషయాన్ని కేంద్ర పెద్దలు మర్చిపోతే తెలంగాణ ప్రజలు క్షమించరు. ప్లాంటు స్థాపించే పరిస్థితి లేదని చెప్పడం కిషన్రెడ్డి చేతకానితనానికి నిదర్శనం.
-శంకర్నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే
బీజేపీది కపట ప్రేమ
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కపట ప్రేమ చూపిస్తున్నది. బయ్యారం పరిశ్రమ సాధ్యం కాదని సిగ్గులేకుండా మాట్లాడిన కిషన్రెడ్డి.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి.
– దాస్యం వినయ్భాస్కర్, చీఫ్ విప్
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మా హక్కు
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మా హక్కు. కిషన్రెడ్డి వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలి. విభజన చట్టంలో బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని పొందుపరిచారు. ఈ విషయం లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణను మోసం చేశాయి.
– ఆరూరి రమేశ్, వర్ధన్నపేట ఎమ్మెల్యే
కిషన్రెడ్డి వ్యాఖ్యలు సిగ్గు చేటు
కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు సిగ్గు చేటు. బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే. తెలంగాణ నుంచి కేంద్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్న వ్యక్తి ఈ ప్రాంత పరిశ్రమల నిర్మాణానికి, అభివృద్ధికి మాత్రం సహకరించట్లేదు. కేంద్రాన్ని ఒప్పించేలా చొరవ తీసుకోవాలి.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్
కేంద్రమంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం
ఉక్కు గనుల కోసం తెలంగాణ ప్రభుత్వం సర్వే నిర్వహించి సిద్ధంగా ఉన్న సమయంలో కేంద్రమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు. బయ్యారం ఉక్కు గనులను కూడా ప్రైవేటీకరించాలనే ఆలోచనతోనే కేంద్రం ఇలా మాట్లాడుతున్నది.
– సండ్ర వెంకటవీరయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే
స్టీల్ ప్లాంట్ సాధించేదాకా పోరాటం
గిరిజనుల హక్కులను కాలరాస్తే వారే తగిన బుద్ధి చెబుతారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారం సాధ్యం కాదని కేంద్రానికి ఇన్నేండ్లకు గుర్తుకొచ్చిందా? బయ్యారం పరిశ్రమను సాధించుకునే వరకు మా పోరాటం ఆగదు. స్టీల్ ప్లాంటు కుదరదంటూ చేతులెత్తేసిన కేంద్ర పెద్దలకు గుణపాఠం చెబుతాం.
– వనమా వెంకటేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే
కేంద్ర మంత్రి మాటలు హాస్యాస్పదం
‘కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి.. ఉక్కు పరిశ్రమ నిర్మిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందిస్తానని చెప్పినా కేంద్రం పట్టించుకోవట్లేదు. ఇది బయ్యారం ప్రజల చిరకాల స్వప్నం.
– అంగోత్ బిందు, జడ్పీ చైర్ పర్సన్, మహబూబాబాద్