Minister Satyavathi Rathod | తనకు తల్లిదండ్రులు జన్మనిస్తే.. రాజకీయ జన్మనిచ్చింది మాత్రం సీఎం కేసీఆర్ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పెద్దతండాలో పుట్టిన తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగానికి గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో రూ.25కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆమె శనివారం ప్రారంభించారు. అనంతరం బతుకమ్మ చీరెల పంపిణీ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ భావోద్వేగానికి గురయ్యారు.
రాష్ట్ర మంత్రిగా ఇప్పటివరకు రూ.6వేల కోట్ల అభివృద్ధి పనులను మంజూరు చేశానని.. కానీ వాటన్నింటి కంటే ఇవాళ తన సొంత ఊరు పెద్దతండాలో చేసిన అభివృద్ధి పనులు జీవితాంతం గుర్తుంటాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. తన తండ్రి లింగ్యానాయక్ ప్రతి రోజు రోడ్ల గురించి గుర్తుచేసేవాడని.. ఆయన కోరిక ఈ రోజు నెరవేరిందన్నారు. తండా అభివృద్ధి చెందాలని తన తల్లిదండ్రులు ఆరాటపడేవారన్నారు. పెద్దతండా నుంచి నర్సతండా వైపు తమ భూములన్నీ ఉన్నాయని, రోడ్డు లేకపోవడంతో తన నాన్న వాళ్ల తమ్ముడు గుగులోతు దేవా నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడని గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పొలం పనులకు వెళ్లిన సమయంలో ఏరు వస్తే ప్రవాహం తగ్గేవరకు అటువైపే ఉండేవారని తెలిపారు. అందుకే ‘బిడ్డా.. రోడ్లు తీసుకురావాలి.. మనోళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారని’ నాటి నుంచి తన తండ్రి లింగ్యా నాయక్ గుర్తు చేసేవారని అన్నారు. కానీ పెద్దతండా అభివృద్ధి చెందే సమయానికి వారిద్దరూ లేరని కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం కేసీఆర్ దయతో నాన్న కోరిక నెరవేర్చానని సభావేదికపైనే బోరుగా విలపించారు.