హైదరాబాద్ : రాష్ట్రంలో గర్భిణి స్త్రీలు, బాలింతలు, పిల్లలకు పోషకాహారాన్ని అందించడానికి ఆరోగ్యలక్ష్మి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది అని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సత్యవతి రాథోడ్ సమాధానం ఇచ్చారు.
ఆరోగ్య లక్ష్మి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో ఒకటి. మహిళలు, పిల్లల్లో రక్తహీనతను తగ్గించడానికి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. 2015, జనవరి 1వ తేదీన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గర్భిణిలకు, బాలింతలకు ప్రతి రోజు 200 ఎంఎల్ పాలు, ఒక కోడిగుడ్డుతో పాటు భోజనం అందిస్తున్నాం. ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు 16 గుడ్లు(నెలకు), 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు 30 గుడ్లను(నెలకు) అంగన్వాడీ సెంటర్ నుంచి అందిస్తున్నామన్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణిలు, బాలింతలు 4,65,805 మంది, ఏడు నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు – 10,43,419, 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలు – 6,74,336 మంది లబ్ది పొందుతున్నారు. ఆరోగ్యలక్ష్మి పథకం కోసం 2015 నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు రూ. 11 వందల 10 కోట్ల 89 లక్షలను ఖర్చు పెట్టడం జరిగింది.
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీలను బలోపేతం చేశాం. అంగన్వాడీ టీచర్లు విశేషంగా సేవలందిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లు రూ.10,500 గౌరవ వేతనం పొందుతున్నారు. దీంట్లో కేంద్రం వాటా రూ. 2700, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.7,800 అని తెలిపారు. ఆయాలకు కేంద్ర వాటా రూ. 1350, రాష్ట్రం వాటా రూ. 4650 ఇస్తున్నాం. పీఆర్సీ అమలైతే టీచర్లకు రూ. 13 వేలకు పైగా, ఆయాలకు అదనంగా రూ. 1300 వస్తుందన్నారు. అంగన్వాడీ టీచర్లు, ఆయాల రిక్రూట్మెంట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు. గర్భిణిలు, పిల్లల పోషణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి బాలామృతం అందిస్తున్నాం అని తెలిపారు. అంగన్వాడీ ఖాళీల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు.