హైదరాబాద్ : సమ్మక్క – సారక్క జాతరకు ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని ఆమె పేర్కొన్నారు. అసెంబ్లీలోని కౌన్సిల్ హాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ మీడియాతో చిట్ చాట్ చేశారు.
కరోనా కారణంగా భక్తులు ముందుగానే వనదేవతలను దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారని తెలిపారు. రోజుకు 3 లక్షల వరకు భక్తులు వస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం సమ్మక్క – సారక్క దేవస్థానం టూరిజం ప్లేస్గా మారిందన్నారు.
జాతరలో మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. మాస్క్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. షిఫ్ట్ వైజ్గా దర్శనం చేసుకునేందుకు ఏర్పాట్లు చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఎప్పటికప్పుడు శానిటేషన్ చేస్తున్నామని పేర్కొన్నారు. బయో, రెగ్యులర్ టాయిలెట్స్ అందుబాటులో ఉన్నాయన్నారు.
గంటల పాటు క్యూలైన్లో భక్తులు నిల్చోకుండా, అర గంటలో దర్శనం అయ్యే విధంగా ఏర్పాట్లు చేయబోతున్నామని తెలిపారు. వీఐపీ పాస్పై టైమింగ్ స్లాట్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. జాతరలో టెక్నాలజీని మరింత ఎక్కువగా ఉపయోగిస్తున్నామని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
సమ్మక్క – సారక్క జాతరకు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదు అని ఆమె స్పష్టం చేశారు. ఈ జాతరకు నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని రకాలుగా కేంద్రాన్ని అడుగుతున్నామని చెప్పారు. 8 వేల ఆర్టీసీ బస్సులను జాతరకు అందుబాటులో ఉంటాయన్నారు.
ఈ ఏడాది మేడారం జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. సీఎం ఫిబ్రవరి 18వ తేదీన వస్తారని సమాచారం ఉందన్నారు.