హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తక్షణమే సమ్మె విరమించాలని స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు. స్వార్థ రాజకీయాల మాయలో పడి, ప్రభుత్వానికి మచ్చ తేవద్దని కోరారు. శుక్రవారం ఆమె స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిధిలోని అంశాలను పరిష్కరించామని, కేంద్రం పరిధిలోని అంశాలను రాష్ర్టానికి ముడిపెట్టి సమ్మె చేయడం సరికాదని అన్నారు. అంగన్వాడీలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వినతిపత్రాల ద్వారా పరిష్కరించుకోవాలే కానీ సమ్మెకుదిగి చిన్నారులు, బాలింతలు, గర్భిణులను ఇబ్బందిపెట్టవద్దని సూచించారు. అంగన్వాడీ యూనియన్లతో గత నెల 18న సమావేశం నిర్వహించి, ఆయా డిమాండ్లను తీరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా సమ్మెకు దిగడం ఏవిధంగా నైతికమో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
సీఐటీయూ, ఏఐటీయూసీ వైఖరి బాధాకరం
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడాలేని విధంగా అంగన్వాడీలను గౌరవించి, సమస్యలను మానవీయ కోణంలో పరిష్కరించిన ప్రభుత్వానికి మచ్చ తెచ్చేవిధంగా సీఐటీయూ, ఏఐటీయూసీ వ్యవహరించడం బాధాకరమని సత్యవతిరాథోడ్ ఆవేదన వ్యక్తంచేశారు. రాజకీయ దురుద్దేశంతో అంగన్వాడీలను ఉసిగొలిపి సమ్మెచేసేలా ఒత్తిడి తేవడం సమంజసం కాదని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడుసార్లు అంగన్వాడీలకు వేతనాలు పెంచామని చెప్పారు. సీఎం కేసీఆర్ అంగన్వాడీల సమస్యలను మానవీయ కోణంలో విని, వారితో రోజంతా చర్చించి వేతనాలు పెంచిన విషయం వాస్తవమా? కాదా? అని ప్రశ్నించారు.
దురదృష్టవశాత్తు పనిచేస్తున్న కాలంలో మరణించిన అంగన్వాడీలకు రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా, 50 ఏండ్లలోపు ఉన్న అంగన్వాడీలకు రూ.2 లక్షల బీమా కల్పించిన ప్రభుత్వం దేశంలో తెలంగాణ తప్ప మరొకటి ఉన్నదా? అని ప్రశ్నించారు. పదవీ విరమణ సమయంలో టీచర్కు రూ.లక్ష, సహాయకులకు రూ.50 వేలు చెల్లించే విధంగా ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు. కొన్ని రాష్ర్టాల్లో ప్రతినెలా అంగన్వాడీల వేతనాల నుంచి కొంత మొత్తం కట్ చేసి, పదవీ విమరణ సమయంలో రెండు, మూడు లక్షలు చెల్లిస్తున్నారని, అయితే రాష్ట్రంలో మాత్రం ఇలా కట్ చేయడం లేదని చెప్పారు. బీమా ప్రీమియాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని స్పష్టంచేశారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేశామని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులను ఇంకా కేంద్రం ఆమోదించలేదని, దీనిపై కమిషనర్ను ఢిల్లీకి పంపుతున్నామని వెల్లడించారు. ప్రతి నెలా 14న గౌరవ వేతనం అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని చెప్పారు. అనేక రాష్ర్టాల్లో తెలంగాణ కన్నా చాలా తక్కువ వేతనాలు ఇస్తున్నారని వివరించారు.
తెగే దాకా లాగడం మంచిది కాదు
సమ్మె పరిష్కారం కాదని, దురుద్దేశపూర్వకంగా సమ్మె చేయడం మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు. సమ్మె చేయడం తమ హక్కుగా భావించే యూనియన్ ప్రతినిధులు.. ప్రభుత్వం అందించే పోషకాహారంపై ఆధారపడిన లక్షలాది లబ్ధిదారులకు దక్కాల్సిన ప్రయోజనాలను అడ్డుకోవడం ఏవిధంగా సరైనదని ప్రశ్నించారు. అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు వేయడం, ప్రత్యామ్నాయ విధులు నిర్వహిస్తున్న వారి విధులకు ఆటంకం కలిగించడం, ఏదైనా తెగేదాకా లాగడం మంచిది కాదని సున్నితంగా హెచ్చరించారు. యూనియన్లతో సమావేశం నిర్వహించి, డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలం నిర్ణయం తీసుకుని, ఉత్తర్వులు జారీచేసిన తరువాత కూడా ఉద్దేశపూర్వకంగా సమ్మెకు దిగిన కొన్ని సంఘాలను తిరిగి చర్చలకు ఆహ్వానిస్తే ఫలితం ఏముంటుందని మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అంగన్వాడీ సేవలకు విఘాతం కలుగకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిందని తెలిపారు. సమావేశంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ భారతి హొలికేరి, జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.
కేంద్రంతో పొరాటం చేద్దాం
అంగన్వాడీల క్రమబద్ధీకరణ అంశం కేంద్రం పరిధిలో ఉన్నదని సత్యవతి రాథోడ్ స్పష్టంచేశారు. కేంద్రం పరిధిలో ఉన్న డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించలేదని, ఆయా సమస్యల సాధన కోసం కేంద్రంతో పోరాడుదామని చెప్పారు. కేంద్రానికి స్వయంగా లేఖ రాస్తానని, అవసరమైతే కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానని అభయమిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో పీఆర్సీ పెంచే నిర్ణయం రాబోతున్నదని, అందులో తప్పకుండా అంగన్వాడీలకు న్యాయం జరుగుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు.