Satyavathi Rathod | ఇంటర్ ఫలితాల్లో గురుకుల విద్యార్థులు సత్తాచాటారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ఫలితాలు సాధించారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న గిరిజన గురుకులాల్లో విద్యార్థులు 84శాతం పర్సంటైల్ దక్కించుకున్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులను అభినందించారు. గిరిజనుల పేదరికాన్ని శాశ్వతంగా తొలగించాలంటే నాణ్యమైన విద్య ఒక్కటే మార్గమని సీఎం కేసీఆర్ భావించి.. గురుకులాలను ఏర్పాటు చేశారన్నారు. ఇంటర్ ఫలితాల్లో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 73.65శాతం, సెకండియర్లో 84.95శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.
ద్వితీయ సంవత్సరంలో భూక్య గణేశ్ 991 (MPC), పుణెమ్ అక్షిత్ 985 (BiPC), ఎం కావ్య 988 (MPC).. మొదటి సంవత్సరం ఫలితాల్లో వాంకుడోత్ భువన్ 467/470 (MPC) మార్కులు సాధించారన్నారు. సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేనివిధంగా అన్నివర్గాలకు కేజీ టు పీజీ విద్య ఉచితంగా అన్నివర్గాలకు ఉన్నత ప్రమాణాలతో అందిస్తున్నారని, దాంతో గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధిస్తున్నారన్నారు. ప్రైవేట్ దీటుగా ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థులను మంత్రి అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి విద్యార్థులు సాధిస్తున్న ఉత్తీర్ణత శాతమే నిదర్శనమన్నారు. గురుకులాల్లో నాణ్యమైన విద్యావిధానం, ఇంగ్లిష్ మీడియంలో బోధన, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం, పౌష్టికాహారం వంటి విద్యాభివృద్ధి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదు పెరిగిందని తెలిపారు. రికార్డు స్థాయిలో గిరిజన విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడానికి కృషి చేసిన అధికారులను, ఉపాధ్యాయులను సిబ్బందిని మంత్రి అభినందించారు.