హైదరాబాద్ : జనాభాలో సగమైన తమకు చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల సైతం అమలు చేయాలని పోరాడిన ఎమ్మెల్సీ కవిత ఉద్యమం వృథాకాలేదని, కవిత పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదించడంపై మంత్రి సత్యవతి స్పందించారు.
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల బిల్లును (Women’s Reservation Bill) లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక ఎమ్మెల్సీ కవిత, బీఆర్ఎస్ (BRS) కృషి ఉందన్నారు. ఈ పోరాట ఫలితంగా లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కనున్నాయి. మహిళా బిల్లుపై కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఆకాశంలో సగం, భూమిలో సగం, అధికారంలో సగం నినాదం అమలు కానుందని చెప్పారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్రానికి లేఖ రాసి సీఎం కేసీఆర్ పెద్ద పాత్ర పోషించారని చెప్పారు. మహిళా బిల్లుపై ఎమ్మెల్సీ కవిత నిర్విరామ పోరాటంతో గెలుపు సాధించాం. 33 శాతం రిజర్వేషన్ అమలుతో దేశ వ్యాప్తంగా మహిళలకు గొప్ప అవకాశం దక్కనుందని పేర్కొన్నారు. గతంలోనూ లోక్సభలో ఎంపీగా ఎమ్మెల్సీ కవిత అనేక సందర్భాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు మహిళా సాధికారతపై గళం విప్పిన విషయాన్ని గుర్తు చేశారు.
మార్చిలో ఎమ్మెల్సీ కవితతో కలిసి మేం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేయడం, రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినట్లు మంత్రి తెలిపారు. కవిత ఒక్క పిలుపుతో దాదాపు 47 రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చారు అని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. పోరాటలకు తలొగ్గే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమెదం తెలిపిందన్నారు.