హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇవ్వండి ప్లీజ్ అని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారని, ప్లీజ్ గ్యాస్ ధరలు తగ్గించండని ప్రజలు అంటున్నారని చెప్పారు. పెట్రోల్ ధరల పెంపును నిరసిస్తూ మహేశ్వరం నియోజకవర్గంలోని బాలాపూర్ చౌరస్తాలో టీఆర్ఎస్ భారీ ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్యాస్ ధరలు తగ్గించే వరకు బీజేపీ వాళ్లను గల్లీల్లోకి రానివ్వద్దు పిలుపునిచ్చారు. ధరలు తగ్గించకపోతే ప్రజలు మిమ్మల్ని గద్దె దించుతారని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను భారీగా పెంచడంతో నిత్యావసరాలను ధరలు కూడా రెట్టింపయ్యాయని మంత్రి చెప్పారు. పెరిగిన ధరలతో సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. పెట్రోల్, డీజిల్తోపాటు ప్రతి నెలా గ్యాస్ ధరలను పెంచుతూ జనాలపై భారం మోపుతున్నారని విమర్శించారు.