కందుకూరు : అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtiha Indrareddy) అన్నారు. మండల అభివృద్ధి పనులపై మండల అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులతో మంగళవారం మీర్పేట్ పరిధిలోని ఎస్వైఆర్ గార్డెన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ (CM KCR ) కందుకూరు వరకు మెట్రో రైలు ( Metro Rail ) మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతి ద్వారా పల్లెలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు . మండలంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పేదలకు గ్రామాల్లో ఇండ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గ్రామాల్లో గ్రంథాలయాల ఏర్పాటు చేసుకోవాలని అందుకోసం గ్రంథాలయ సంస్థ నెలకు రూ. 3వేలు, మెయింటేన్స్కు రూ.10 వేలు, పుస్తకాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి పాఠశాలలో రీడింగ్ రూంలు ఉన్నాయని వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవడానికి ప్రజాప్రతినిధులు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.
బీసీ రుణాలు ( BC Loans ) , గృహలక్ష్మీ, దళిత బంధు (Dalit Bandu) లాంటి పథకాలు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, మార్కెట్ చైర్మన్ సురుసాని సురేందర్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.