బడంగ్పేట : బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra reddy) అన్నారు. తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను బుధవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు.
ఇటీవలనే ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 150 కోట్లను విడుదల చేశారన్నారు. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి తుక్కుగూడ మీదుగా కందుకూరు వరకు రూ.6.600 కోట్లతో మెట్రో(Metro Rail)నిర్మాణం జరుగనుందని దీని వల్ల ఈ ప్రాంతం ఊహాలకందని విధంగా అభివృద్ది జరుగుతుందన్నారు. నియోజకవర్గంలో రూ.11 కోట్లతో వివిధ కుల సంఘాల వారికి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇంటి నిర్మాణానికి గృహలక్ష్మీ (Grihalaxmi) పథకం కింద ప్రభుత్వం అర్హులైన వారికి రూ. 3 లక్షలు ప్రభుత్వం అందిస్తుందన్నారు. మన ఊరు-మన బడి కింద రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగు అవుతున్నాయని పేర్కొన్నారు. జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 2, 3,4,5 వార్డులలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపనలు చేశారు. ప్రజల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు . వర్షకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.