నిర్మల్ : నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత వారం రోజులుగా చేస్తున్న శాంతియుత నిరసనకు తెర పడింది. సోమవారం అర్ధరాత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయాయి. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు. దీంతో అర్ధరాత్రి 12.30 ప్రాంతంలో విద్యార్థులు ఆందోళన విరమించారు. మంగళవారం నుంచి తరగతులకు హాజరువుతామని ప్రకటించారు. రాత్రి 9.30 నుంచి రెండున్నర గంటలకుపైగా ఈ చర్చలు జరిగాయి. ట్రిపుల్ ఐటీ డైరెక్టర్, నిర్మల్ జిల్లా కలెక్టర్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ తరఫున ప్రతినిధులు హాజరయ్యారు. ప్రభుత్వం విద్యార్థుల 12 డిమాండ్లకు అంగీకారం తెలిపింది. నెల రోజుల్లోగా పూర్తి డిమాండ్లను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చర్చల్లో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, వేణుగోపాల చారి, ఉన్నత విద్యా శాఖ మండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి, స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ 12 డిమాండ్లను పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారని, మౌలిక సదుపాయాలకు తక్షణమే రూ.5.6కోట్లు మంజూరు చేశారని చెప్పారు. గడువులోగా డిమాండ్ల పరిష్కారానికి హామీ, రెగ్యులర్ వీసీ నియామకానికి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు.